ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. వారిని ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా పిలవాలని నిర్దేశించారు. సెప్టెంబరు నెల జీతాన్ని సోమవారమే (డిసెంబరు 2) అందిస్తామన్నారు. కార్మికులు సమ్మె చేసిన 55 రోజులకూ వేతనం ఇస్తామని ప్రకటించారు. దానిని ఏకమొత్తంగా అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ యథావిధిగా ఇస్తామన్నారు. ఆర్టీసీలో ఒక్కరిని కూడా ఉద్యోగంలోంచి తీసేయకుండా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. డిపోకు ఐదుగురు చొప్పున 97 డిపోల నుంచి కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలు, కంట్రోలర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్.. తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైనా, ప్రతి సమస్యపైనా స్పందించారు. అప్పటికప్పుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతి ఏడాదీ వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతి ఉద్యోగి ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ వివరాలు.. ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ సాధించుకున్న స్ఫూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని కోరారు. ‘‘నేను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాను. నేటికీ నాకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉంది. ఆర్టీసీని బతికించడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం. ఇక, అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలి. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించాలి’’ అని పిలుపునిచ్చారు. రూట్లను రీ సర్వే చేయాలని చెప్పారు.
బీజింగ్: చైనాలో ఇకపై మొబైల్ఫోన్ కొనే, వాడే వారంతా ముఖాన్ని స్కాన్ చేయాల్సిందే. దేశ ప్రజలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబరులోనే ప్రకటించిన ఈ నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. మొబైల్ వినియోగదారులంతా అసలు పేర్లు, చిరునామాలతోనే ఫోన్లు కొనే నిబంధనలను చైనా గత కొన్నేళ్లుగా అమలుచేస్తోంది
న్యూఢిల్లీ: క్రికెట్లో రికార్డులుంటేనే అసలైన మజా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. అజేయ ట్రిపుల్ సెంచరీ (335)తో రికార్డుల వర్షం కురిపించాడు. అతడి దెబ్బకు పలు రికార్డులు బద్దలయ్యాయి. వార్నర్ ట్రిపుల్ సెంచరీపై శశిథరూర్ పలు ట్వీట్లు చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం కారణంగా వార్నర్ ప్రపంచ రికార్డును కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్లో ఎవరైనా ఇష్టపడేవి రికార్డులేనని, అవే అభిమానులను అలరిస్తాయని అన్నారు. తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్.. పాకిస్థాన్ లాంటి బలహీనమైన జట్టుపై ఇన్నింగ్స్ను ఎందుకు డిక్లేర్ చేయాల్సి వచ్చిందని థరూర్ నిలదీశారు. డిక్లేర్ చేయకుంటే వార్నర్ 400 పరుగులు సాధించేవాడని, లారా రికార్డు బద్దలై ఉండేదని అభిప్రాయపడ్డారు.
బెంగళూరు: సుప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? కర్ణాటకలో ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయడం చర్చకు కారణమైంది. ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున శనివారం ఆయన రోడ్షో నిర్వహించారు. దీంతో బ్రహ్మానందం బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు కథనా లు వినిపిస్తున్నాయి. చిక్కబళ్లాపుర, బాగేపల్లి, గౌరిబిదనూరు నియోజకవరాల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. తెలుగు సినీ నటుల ప్రభావం కూడా ఈ ప్రాంతం లో ఎక్కువే. 2018లో చిక్కబళ్లాపుర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కిరణ్ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రచారం చేశారు.